టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంపికైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. సులక్షణ నాయక్ మరియు ఆర్పి సింగ్లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం నాడు రాహుల్ ద్రవిడ్ ను టీమిండియా హెడ్ కోచ్గా ఏకగ్రీవంగా నియమించిందని తెలిపారు. న్యూజిలాండ్తో జరగనున్న స్వదేశీ సిరీస్ నుంచి రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ముందుగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండటంతో, తదుపరి కోచ్ ను నియమించడానికి బీసీసీఐ అక్టోబర్ 26న దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా మాజీ టీమ్ డైరెక్టర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి, బి.అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్) మరియు విక్రమ్ రాథోర్ (బ్యాటింగ్ కోచ్) లు తమ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. శాస్త్రి ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు సాహసోపేతమైన మరియు నిర్భయమైన విధానాన్ని అవలంబించిందని కొనియాడారు. స్వదేశంలో మరియు బయటి పరిస్థితులలో జట్టు ఘనమైన ప్రదర్శన చేసిందని, ఇంగ్లండ్లో జరిగిన తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ టెస్టు ఫార్మాట్లో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్కు చేరుకుందని పేర్కొన్నారు. ఇక హెడ్ కోచ్ గా ఎంపికైన రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షా శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ