కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో డిసెంబర్ 12, గురువారం నాడు టిఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులను సత్వరమే విడుదల చేయాలని ఎంపీలు ఆమెను కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను ఎంపీలు నిర్మలా సీతారామన్ కు అందజేశారు. భేటీ అనంతరం టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు అందేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేస్తుందని ఆరోపించారు. ఆర్థిక మంత్రిని కలిసిన వారిలో టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఎంపీలు జి.రంజిత్ రెడ్డి, వి.లక్ష్మీ కాంతారావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, బండ ప్రకాష్, మాలోతు కవిత, బి.లింగయ్య యాదవ్, ఎం.శ్రీనివాసరెడ్డి, బి.వెంకటేష్ ఉన్నారు. ఈ విషయంపై కేంద్రప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం నాడు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
[subscribe]