ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ బోణీ చేసింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు ఓవరాల్ గా ఇది 1000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈ వన్డే సిరీస్ ద్వారా రోహిత్ శర్మ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా వైదొలగటంతో బీసీసీఐ రోహిత్ శర్మను పూర్తిస్థాయి కెప్టెన్ గా నియమించడం తెలిసిందే. తొలి మ్యాచ్లోనే రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ 51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో హోల్డర్ ఒక్కడే (57) రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. 28 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. కెప్టెన్ రోహిత్ తోపాటుగా.. యువ ఆటగాడు సూర్యకుమార్ 34 పరుగులు, అరంగేట్ర ఆటగాడు దీపక్ హుడా 26 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ (4/49), వాషింగ్టన్ సుందర్ (3/30) విండీస్ పతనాన్ని శాసించారు. యజ్వేంద్ర చాహల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందుగా.. ప్రముఖ గాయని, ‘భారతరత్న’ లతా మంగేష్కర్ మృతికి శ్రద్ధాంజలి ఘటించిన టీమిండియా బ్లాక్ బ్యాండ్స్ ధరించి బరిలోకి దిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ