భారత యువ క్రికెటర్ పృథ్వీ షా పై బీసీసీఐ చర్యలు తీసుకుంది, ఎనిమిది నెలల పాటు ఏ విధమైన క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. డోపింగ్ టెస్టులలో భాగంగా పృథ్వీ షా నిషేదిత డ్రగ్ తీసుకున్నట్టు తేలడంతో సస్పెన్షన్ విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ సమయంలో యాంటీ డోపింగ్ టెస్టులలో భాగంగా పృథ్వీ షా ఇచ్చిన యూరిన్ నమూనాల్లో టెర్బుతలైన్ అనే నిషేదిత డ్రగ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇది సాధారణంగా వాడే దగ్గు మందుల్లో ఉంటుందని తెలిపిన బీసీసీఐ, అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిబంధనల ప్రకారం ఆట ఆడేటప్పుడు, బయట కూడ క్రీడాకారులకు ఈ డ్రగ్ వాడకం నిషేదితం అని తెలిపింది.
జూలై 16న వెల్లడైన డోపింగ్ ఫలితాల ప్రకారం, బీసీసీఐ పృథ్వీ షా ను వివరణ కోరగా, దగ్గు మందు వినియోగం వలనే నిషేదిత డ్రగ్ తన శరీరంలోకి వచ్చిందని పృథ్వీ షా ఇచ్చిన వివరణతో బీసీసీఐ సంతృప్తి చెందినట్లు సమాచారం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ మార్చి 16 నుంచి నవంబర్ 15 వరకు ఎనిమిది నెలల పాటు బ్యాక్ డేటెడ్ నిషేధం విధించింది. నిషేధంపై పృథ్వీ షా స్పందిస్తూ, ఆస్ట్రేలియా పర్యటనలో పాదం గాయం నుండి కోలుకొని, తిరిగి జట్టులోకి రావాలనుకుంటున్న సమయంలో ఇది జరిగింది, నేను తీసుకున్న దగ్గు మందుపై జాగ్రత్త వహించలేదు, బీసీసీఐ నిర్ణయాన్ని శిరసావహిస్తాను అని తెలిపాడు. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచినా బీసీసీఐ, మరియు స్నేహితులుకు దన్యవాదాలు చెప్పాడు. క్రికెట్టే తన జీవితం అని, భారత్ కు, ముంబయికి ఆడడం కంటే పెద్ద గౌరవం మరేది లేదని, ఈ పరిస్థితుల నుండి త్వరగా కోలుకుని మళ్ళీ దృడంగా మైదానంలో అడుగు పెడతానని పృథ్వీ షా పేర్కొన్నాడు.