భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 7, గురువారం నాడు రాజ్కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విజృంభించడంతో భారత జట్టు ఘనవిజయం సాధించింది. రోహిత్ శర్మ 43 బంతుల్లో 85 పరుగులు చేయడంతో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను భారత జట్టు చిత్తు చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని, భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి కేవలం 15.4 ఓవర్లలోనే సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచిన కూడ, రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 153 పరుగులు చేసింది. మహమ్మద్ నయీమ్ (36), సౌమ్య సర్కార్ (30) పరుగులతో రాణించారు, భారత బౌలర్లలో స్పిన్నర్ చహల్ 2 వికెట్లు తీయగా, చహర్, ఖలీల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే బంగ్లా బౌలర్లులపై ఆధిపత్యం చూపించారు. ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్ నుంచి రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 6 సిక్స్లు సహాయంతో 85 పరుగులు చేసాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులతో రాణించాడు. రోహిత్, ధావన్ అవుట్ అయ్యాక మరో వికెట్ పడకుండా శ్రేయస్ అయ్యర్ (13 బంతుల్లో 24), లోకేశ్ రాహుల్ (8) పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ పూర్తీ చేసారు. బంగ్లా బౌలర్లలో అమినుల్ ఇస్లామ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొదటి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. రెండో వన్డే లో భారత్ విజయంతో సిరీస్ ఇప్పటికి 1-1 తో సమం అయింది. ఇక కీలకమైన మూడో టీ20 నవంబర్ 10, ఆదివారం నాడు నాగపూర్ లో జరగనుంది.