2020 లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి పలువురు ఆటగాళ్లు తమ ప్రాంచైజ్ లు మారుతున్నారు. ఇప్పటి వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించి నడిపించిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇకపై ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్నాడు. గత రెండు సీజన్లలో తమ జట్టుకు సారథ్యం వహించిన రవిచంద్రన్ అశ్విన్ ను ఢిల్లీ జట్టుకు బదిలీ చేసేందుకు పంజాబ్ యాజమాన్యం అంగీకరించింది. 2018 సీజన్లో పంజాబ్ జట్టు అశ్విన్ ను రూ. 7.8 కోట్లకు కొనుగోలు చేసింది, అతని ఆధ్వర్యంలో జట్టు 12 మ్యాచులు గెలిచి, 16 మ్యాచుల్లో ఓడిపోయింది. అశ్విన్ జట్టును ఆశించినమేరకు నడిపించలేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం భావిస్తుంది.
రవిచంద్రన్ అశ్విన్ ప్రాంచైజ్ మార్పుపై త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానుంది. జట్టులోకి ఒక యువ స్పిన్నర్ ను తీసుకునే ఉద్దేశంతోనే పంజాబ్ జట్టు అశ్విన్ ను వదులుకునేందుకు సిద్ధపడిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేసారు. అశ్విన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సైతం ప్రయత్నించినట్టు సమాచారం. ఇక అనుభవజ్ఞుడైన రవిచంద్రన్ అశ్విన్ సేవలు జట్టుకు ఈ సీజన్లో ఉపయోగపడతాయని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలియజేసాడు. మరో వైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రధాన కోచ్ మరియు జట్టు కెప్టెన్ ఎంపికపై దృష్టి సారించనున్నారు. పంజాబ్ జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నాడు.