భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ 1-1 తో సమం అయింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో భారతజట్టుపై దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారతజట్టు 20 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రమే 36 పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ 9 పరుగులతో, కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 పరుగులు చేసి వెనుదిరిగారు. భారత్ బ్యాట్స్ మెన్ పై దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తి ఆధిపత్యం చూపెట్టారు. మిగిలిన బ్యాట్స్ మెన్ కూడ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో జట్టు కేవలం 134 పరుగులే చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మూడు వికెట్లు పడగొట్టగా, ఫోర్టుయిన్, హెండ్రిక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం 135 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు ఒకే ఒక వికెట్ కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని సాధించింది. కెప్టెన్ డికాక్ 6ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆరంభం నుంచే మరో ఓపెనర్ హెండ్రిక్స్ తో కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదురుకుని పరుగులు సాధించారు. నవదీప్ సైనీ, క్రునాల్ పాండ్యా ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో హెండ్రిక్ ఔటవ్వడంతో, క్రీజులోకి వచ్చిన బవుమాతో కలిసి డికాక్ 16.5 ఓవర్లలోనే 140 పరుగులు చేసి జట్టుకు ఘనవిజయం అందించారు. మొదటి టీ20 వర్షం వలన రద్దు అవగా, రెండో టీ20లో భారత్ జట్టు విజయం సాధించింది. మూడో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం అయింది. ఇక అక్టోబర్ 2 నుంచి ఇరుజట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ మొదలవనుంది. తోలి టెస్టు విశాఖపట్నంలో జరుగుతుంది.