టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు టీమిండియా అదరగొడుతోంది. పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థి ఎవరైనా విజయమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించిన భారత్, తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్ లోనూ అదే ఊపు కొనసాగిస్తోంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం తిరువనంతపురంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. బౌలింగ్లో అర్ష్దీప్, చాహర్, హర్షల్ పటేల్.. బ్యాటింగ్లో రాహుల్, సూర్యకుమార్ రాణించడంతో భారత్ అలవోకగా గెలుపునందుకుంది. తద్వారా సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.
టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందు బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నమ్మకాన్ని నిలబెడుతూ యువ పేసర్లు దీపక్ చాహర్, అర్ష్దీప్సింగ్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ వెన్ను విరిచారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా, రొసో, మిల్లర్, స్టబ్స్ లను ఖాతా తెరువకముందే పెవిలియన్ చేర్చారు. అలాగే డికాక్ కేవలం ఒక పరుగు చేసి ఔటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే మక్క్రామ్, పార్నెల్, మహారాజ్ జట్టు స్కోరు 100 దాటించడంలో సాయపడ్డారు. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ముఖ్యంగా చివర్లో మహారాజ్ చెలరేగి ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో దోహదపడ్డాడు.
స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ రబాడ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 3 పరుగులు చేసి నోకియా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో భారత్ ఆచితూచి ఆడడంతో.. భారత్ టీ20 చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యల్పంగా 17/1 స్కోరు చేసింది. అయితే ఈ దశలో మరో ఓపెనర్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగి అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ఇంకో వికెట్ పడకుండా టీమిండియా 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అర్ష్దీప్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇక రెండో టీ20 మ్యాచ్ వచ్చే నెల 2న గువాహటిలో జరుగనుంది.
స్కోరు బోర్డు
దక్షిణాఫ్రికా: డికాక్ (బి) అర్ష్దీప్ 1, బవుమా (బి) చాహర్ 0, రిలీ రోసో (సి) పంత్ (బి) అర్ష్దీప్ 0, మార్క్రమ్ (ఎల్బీ) హర్షల్ 25, మిల్లర్ (బి) అర్ష్దీప్ 0, స్టబ్స్ (సి) అర్ష్దీప్ (బి) చాహర్ 0, పార్నెల్ (సి) సూర్య (బి) అక్షర్ 24, కేశవ్ మహారాజ్ (బి) హర్షల్ 41, రబాడ (నాటౌట్) 7, నోకియా (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 106/8.
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-24-2, అర్ష్దీప్ సింగ్ 4-0-32-3, అశ్విన్ 4-1-8-0, హర్షల్ పటేల్ 4-0-26-2, అక్షర్ పటేల్ 4-0-16-1.
భారత్: రాహుల్ (నాటౌట్) 51, రోహిత్ (సి) డికాక్ (బి) రబాడ 0, కోహ్లీ (సి) డికాక్ (బి) నోకియా 3, సూర్యకుమార్ (నాటౌట్) 50, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 16.4 ఓవర్లలో 110/2.
బౌలింగ్: రబాడ 4-1-16-1, పార్నెల్ 4-0-14-0, నోకియా 3-0-32-1, షంసీ 2.4-0-27-0, కేశవ్ 3-0-21-0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY