టెక్సాస్లోని హ్యూస్టన్లో విశాలమైన ఎన్ఆర్జి స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన హౌడీ-మోదీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ కి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమానికి అమెరికా వ్యాప్తంగా 50వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ అనేక విషయాల గురించి మాట్లాడారు, ప్రధాని ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. 50 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో, భారతదేశ జనాభా, వైవిధ్యం, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, ఆధునీకరణ ప్రక్రియ, ఆర్టికల్-370, డిజిటలైజేషన్, బలం మరియు అనేక ఇతర అంశాలను మోడీ ప్రస్తావించారు. ఇక ఉగ్రవాదంపై, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆర్ధిక సాయం అందిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చిందని అందుకు డోనాల్డ్ ట్రంప్ సంపూర్ణ మద్ధతు ఇచ్చి ముందుకు నడుపుతారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
అమెరికాలో జరిగిన 9/11 దాడుల వెనుక మరియు భారతదేశంలో జరిగిన 26/11 దాడుల వెనుక ఉన్న కుట్రదారులెవరో ప్రపంచం మొత్తానికి తెలుసని, అలాంటి వారిపై పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్, అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి ఏంతో ఉందని చెప్పారు. 21వ శతాబ్ధంలో భారత్-అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడి కొత్త కొత్త ఆవిష్కరణలతో రెండు దేశాలు ముందుకెళ్లాలని కోరుకున్నారు. ప్రతి సంవత్సరం కనీసం ఐదు భారతీయేతర కుటుంబాలను భారత పర్యటనకు పంపించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను మోదీ కోరారు. ప్రసంగం ముగించే ముందు, డొనాల్డ్ ట్రంప్ను భారతదేశాన్ని సందర్శించి యుఎస్, మరియు భారతదేశ సంబంధాన్ని బలోపేతం చేయాలని ఆహ్వానించారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం న్యూయార్క్ లో సెప్టెంబర్ 24 మంగళవారం నాడు ట్రంప్, మోదీ సమావేశం జరగనుంది. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్రమోదీ ట్రంప్ తో నాలుగోసారి భేటీ కానున్నారు. ఇరు దేశాలకు సంబంధించి వాణిజ్య, రక్షణ వంటి పలు అంశాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం.
[subscribe]