తెలంగాణ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఉనికి చాటుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ల గురించి ప్రస్తుతానికి పక్కనబెడితే బీజేపీ పరిస్థితి మాత్రం అనూహ్యంగా మారిపోయింది. ఓ దశలో అధికార పార్టీకి గట్టి పోటీనివ్వడమే కాదు.. అధికారంలోకి వచ్చే అవకాశాలను పెంచుకుంటూ వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. పార్టీ పైకెత్తిన బండి సంజయ్ను అధ్యక్షుడిగా మార్చేసి కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచీ బీజేపీ హవా తగ్గుతూ వస్తోంది. వ్యూహాత్మక రాజకీయాలా, స్వయం కృతాపారాదాలో తెలియవు కానీ.. ఆ పార్టీ మాత్రం చతికిలపడింది.
రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో కూడా బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పార్టీ నుంచి సెస్పెండ్ చేసిన రాజాసింగ్ను మళ్లీ ఆహ్వానించి గోషామహల్ టికెట్ ఇవ్వడంతో అక్కడ పరిస్థితి కాస్త బాగానే ఉన్నా.. మిగతా చోట్ల ఆశాజనకంగా లేదు. దీనికితోడు టికెట్ల కేటాయింపులో అసంతృప్తితో చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొందరు కార్పొరేటర్లయితే రాజీనామా చేశారు. గ్రేటర్లో పార్టీ అధ్యక్షులుగా ఉన్న కొందరు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అందుకు కారణం వారికి టికెట్ దక్కకపోవడమే. పార్టీ ఆవిర్భావం నుంచి పరిశీలిస్తే ప్రతి ఎన్నికల్లో నగర అధ్యక్షుడుగా ఉన్న నేతకు బీజేపీ అధిష్ఠాం టికెట్ కేటాయించేది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం బీజేపీ నగర అధ్యక్షులలో ఒకరికి మాత్రమే టికెట్ దక్కింది. ముగ్గురికి నిరాశే మిగిలింది.
1983లో జరిగిన ఎన్నికల్లో ఆనాడు నగర అధ్యక్షుడిగా ఉన్న ఆలె నరేంద్రకు చాంద్రాయణగుట్ట నుంచి 1985లో పూర్వ హిమాయత్నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. 1989లో అధ్యక్షుడిగా ఉన్న బద్దం బాల్రెడ్డి కార్వాన్ నుంచి, 1994లో జి.ఆర్.కరుణాకర్ సికింద్రాబాద్ నుంచి, 1999లో డాక్టర్ కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి, 2009లో చింతల రాంచంద్రారెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి, 2014లో బి.వెంకటరెడ్డి మలక్పేట నుంచి, 2018లో ఎన్.రాంచందర్రావు మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో వీరంతా నగర అధ్యక్షులుగా ఉండడం వల్లనే ఆ టికెట్లు దక్కాయి.
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. పార్టీ విస్తరణ కోసం గ్రేటర్ హైదరాబాద్ను సెంట్రల్, మహంకాళి, గోల్కొండ, భాగ్యనగర్ పేరుతో నాలుగు జిల్లాలుగా విభజించారు. సెంట్రల్ జిల్లాకు డాక్టర్ ఎన్.గౌతమ్రావును, మహంకాళి జిల్లాకు శ్యాంసుందర్గౌడ్ను, గోల్కొండకు పాండుయాదవ్ను, భాగ్యనగర్కు సురేందర్ రెడ్డిని అధ్యక్షులుగా నియమించారు. అయితే.. గౌతమ్రావు అంబర్పేట టికెట్ను, శ్యాంసుందర్గౌడ్ సనత్నగర్ టికెట్ను, పాండుయాదవ్ గోషామహల్ టికెట్ను ఆశించారు. సురేందర్రెడ్డికి మలక్పేట టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్ఠానం మిగతా అధ్యక్షులను విస్మరించింది. దీనిపై ఆయా నాయకులు గుర్రుగా ఉన్నారు. అభ్యర్థులకు వారు ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE