ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇవ్వాలనుకున్న రూ.12,500 లను రూ.13,500 లకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో మరి కొన్ని మార్పులు చేస్తూ నవంబర్ 26, మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యంగా రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసేలా ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే అటవీ ప్రాంతాలలో భూమి సాగు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు సంబంధించిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తించేలా చేసింది.
ఈ పథకం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర మాజీలను అనర్హులుగా ప్రకటిస్తూ వారికి మినహాయింపు నిచ్చారు. రైతు సంతానంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, టాక్స్ కడుతున్నా కూడ పథకానికి అర్హులుగా ప్రకటించారు. ఒకవేళ అర్హుడైన రైతు మరణిస్తే, అతని భార్యకు రైతు భరోసా సాయం అందజేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. తరువాతి సంవత్సరం నుంచి ప్రభుత్వ సమాచారం ప్రకారం ఆ భూమి ఎవరి పేరు మీద ఉంటే వారికి ఈ పథకాన్ని వర్తింపజేసేలా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
[subscribe]