హుజూర్నగర్ ఉపఎన్నికలకు నామినేషన్ పక్రియ సెప్టెంబర్ 30, సోమవారంతో ముగియగా అధిక సంఖ్యలో 76 మంది నామినేషన్స్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాడు అధికారులు నామినేషన్లు పరిశీలన చేసారు. పరిశీలన అనంతరం పలు రకాల కారణాలతో 45మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. 31మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆమోదం తెలిపారు. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీ అయిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్రావు కు ఊహించని షాక్ తగిలింది. దీంతో శేఖర్రావుతో పాటు, సీపీఎం పార్టీ నాయకులు నామినేషన్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఎల్ఎఫ్ పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి నలమాద పద్మావతిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి డాక్టర్ కోట రామారావు బరిలోకి నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి సాంబశివరావుగౌడ్ నామినేషన్లు కూడ అంగీకారం పొందాయి. మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందగా, సర్పంచ్ల ఫోరం నుంచి నామినేషన్ వేసిన వారిలో ఒక్కరిది మాత్రమే ఆమోదం పొందింది. నాగర్కర్నూల్ జిల్లా తండ్రికల్ సర్పంచ్ అయిన తాళ్ల పాండుగౌడ్ నామినేషన్ కు అంగీకారం లభించింది. అక్టోబర్ 3, గురువారం నాడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలియనుంది.
[subscribe]