తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితమే టీఎంయూ, టీజేఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5వ తేదీ ఉదయం నుంచి సమ్మెకు దిగుతున్నట్టు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం బస్ భవన్ లో ఇతర జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. చర్చల వలన తగిన ఫలితం లేనందు వలనే, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, కార్మికులకు ఉద్యోగ భద్రత, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, మోటార్ వెహికల్ టాక్స్ రద్దు, ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లతో అక్టోబర్ 5నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు వివరించారు.
దసరా పండుగ సమయంలో సమ్మె చేస్తున్నట్లు ప్రకటించి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. సమస్యల పరిష్కరాన్నీ కోరుతూ సెప్టెంబర్ 3న ప్రభుత్వానికి లేఖ రాసిన కూడ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటామని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. మరో వైపు అక్టోబర్ 4న కార్మికశాఖ అధికారులతో జరిగే చర్చల్లో పాల్గొంటామని, ఒకవేళ చర్చలు విఫలమైతే 5వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటామని టీఎస్ఆర్టీసీ జేఏసీ-1 రాష్ట్ర కో కన్వీనర్ కె.హనుమంతు ప్రకటించారు.
[subscribe]