ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 30, సోమవారం నాడు తిరుమల వెళ్లనున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని రాష్ట్రప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 3 గంటలకు తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయాన్ని ప్రారంభించనున్నారు. పద్మావతి నిలయం ప్రారంభోత్సవ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని సంబంధిత అధికారులు తెలియజేసారు. ఇక సాయంత్రం 5.15 గంటలకు నందకం అతిథి గృహం వద్ద వకుళా మాత అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. తిరుపతిని సందర్శించే భక్తుల సౌకర్యార్ధం నిర్మిస్తున్న మరో ఉచిత సముదాయ కాంప్లెక్స్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు.
రాత్రి 7గంటలకు బేడి ఆంజనేయస్వామి వద్ద నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. అనంతరం శ్రీవారిని దర్శనం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30వ తేదీన ధ్వజారోహణంతో మొదలయ్యి అక్టోబరు 8వ తేదీన చక్రస్నానంతో ముగుస్తాయి. ఇక రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబర్ 1వ తేదీ ఉదయం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వస్తున్న నేపథ్యంలో తిరుమలలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
[subscribe]