ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఈ సంవత్సరం నుంచి కొత్తగా హైదరాబాద్ ప్రాంచైజీ ఆడబోతుంది. అక్టోబర్ 20 నుంచి మొదలుకాబోయే ఈ సీజన్ ఐఎస్ఎల్ లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ తలపడనుంది. సెప్టెంబర్ 29, ఆదివారం నాడు హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ప్రముఖ తెలుగు సినీనటుడు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ జట్టు యజమాని విజయ్ మద్దూరి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో సరైన ప్రణాళికలతో ఫుట్బాల్ ను విస్తరిస్తామని చెప్పారు. ఫుట్బాల్ కు తగిన ప్రాచుర్యం కల్పించేందుకు తమ యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు.
హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ మరో సహా యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ, నగరానికి ఫుట్బాల్లో గొప్ప చరిత్ర ఉందని, కొత్త జట్టుతో దాన్ని మరింత బలపరిచేందుకు తగినంత కృషి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ కు ఘనమైన ఫుట్బాల్ వారసత్వం ఉందని, తొమ్మిది సంవత్సరాల క్రితమే ఫుట్బాల్ అభివృద్ధి కోసం ప్రయత్నించానని కానీ అది సాధ్యపడలేదు, ఇకనైనా హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ రూపంలో మంచిరోజులు వచ్చినట్టేనని భావిస్తున్నానని హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. హీరో వెంకటేష్ మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పలువురు అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆడారని, 1956లో ఒలంపిక్స్ లో పాల్గొన్న భారతజట్టులో 8 మంది హైదరాబాద్ ఆటగాళ్లే అని చెప్పారు. ఒక క్రీడాభిమానిగా హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ కు స్వాగతం చెప్తున్నానని వెంకటేష్ అన్నారు.