తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 22, బుధవారం నాడు 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మందికిపైగా ప్రజలు రేపు జరగబోయే ఓటింగ్ లో పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్పురా డివిజన్కు రేపు ఉపఎన్నిక జరుగుతుంది. 45 వేల మందికి పైగా సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. జనవరి 21, మంగళవారం సాయంత్రానికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. కార్పోరేషన్, మునిసిపాలిటీల్లోఎన్నికల దృష్ట్యా జనవరి 20, సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి జనవరి 22, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 25న చేపడతారు.
మున్సిపల్ ఎన్నికల వివరాలు:
- ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలు: 120
- ఎన్నికలు జరిగే కార్పోరేషన్లు: 10
- ఎన్నికలు జరిగే మొత్తం వార్డుల సంఖ్య: 2647
- ఎన్నికలు జరిగే కార్పోరేషన్ల డివిజన్లు: 324
- మునిసిపాలిటీలలో ఏకగ్రీవమైన వార్డులు: 80
- కార్పోరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు: 3
- మునిసిపాలిటీలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య: 11179
- కార్పోరేషన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య: 2118
- మునిసిపాలిటీ పరిధిలో పోలింగ్ స్టేషన్స్: 6188
- కార్పోరేషన్ల పరిధిలో పోలింగ్ స్టేషన్స్: 1773
- ఎన్నికల సిబ్బంది: 45,000
- కౌంటింగ్ సిబ్బంది: 10000
[subscribe]