అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడిన రాజధాని అమరావతి రైతులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలపై లాఠీఛార్జ్ జరిగిన తీరు కంటతడి పెట్టిస్తోందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై కనికరం లేకుండా లాఠీ ఛార్జ్ చేయించారని అన్నారు. రైతుల మీద వైసీపీ నాయకులు వాడిన పద జాలం, వారి పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. మహిళలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపినా కూడా వైసీపీ పార్టీ వారిపైన దాడి చేయించిందని, వైసీపీ ప్రభుత్వ పాలనను కూల్చే వరకు జనసేన పార్టీ నిద్రపోదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని రైతులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఎన్ని రాజధానులు మార్చినా కూడా శాశ్వత రాజధాని అమరావతే ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో భూములు కొని రాజధానిని అక్కడికి మారుస్తున్నారని విమర్శించారు. రైతుల బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతుందని, ఇష్టానుసారంగా రైతులపై దాడులు చేశారని అన్నారు. రైతులను పరామర్శించేందుకు కూడా ఈ ప్రభుత్వం అనుమతివ్వడం లేదని మండిపడ్డారు. జనవరి 22, బుధవారం నాడు ఢిల్లీకి వెళ్తున్నానని, రాజధాని మార్పుపై కేంద్రప్రభుత్వ పెద్దలకు అన్నీ వివరిస్తానని చెప్పారు. ” ఒక్క మాట ఇస్తున్నాను, అమరావతి ఇక్కడి నుండి కదలదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతిని శాశ్వతంగా ఉంచేలా పోరాటం చేస్తాం. ఈరోజు అమరావతి ప్రజల్ని మోసం చేసిన వారు రేపు కడప ప్రజలను, శ్రీకాకుళం ప్రజలను మోసం చేస్తారు. వైసీపీ నాయకులకు ప్రజల మీద ప్రేమ ఉండదు. నేను అవకాశవాద రాజకీయాలు చేయనని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
[subscribe]