తెలంగాణ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. విధానం రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల బృందం జనవరి 21, మంగళవారం నాడు కేరళలో పర్యటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తో కూడిన బృందం తిరువనంతరపురంలో కేరళ ప్రభుత్వ ప్రవాస కేరళీయుల సంక్షేమ వ్యవహరాల శాఖ (నోర్కా) కార్యదర్శి ఇళంగోవన్, ‘నోర్కా రూట్స్’ సంస్థ సీఈవో హరికృష్ణ నంబూద్రితో సమావేశమయ్యారు. వివిధ దేశాల్లో ఉంటున్న కేరళ వాసుల సంక్షేమం కోసం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకోసం అవలంభిస్తున్న విధానంపై విస్తృతంగా చర్చించారు. అక్కడి విధాన పత్రాలను సీనియర్ అధికారుల బృందం అధ్యయనం చేసింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి విద్య, ఉపాధి,ఇతర అవసరాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతున్నారు. అక్కడ వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు ఓ సమగ్ర విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే ఎన్.ఆర్.ఐ. పాలసీలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర అధికారుల బృందం కేరళలో పర్యటిస్తుంది.
[subscribe]