తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల క్రితం బీఆర్ ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ సీన్ కూడా అలాగే కనిపించింది. అధికార పార్టీ బీఆర్ ఎస్ కూడా బీజేపీ లక్ష్యంగానే విమర్శనాస్త్రాలు ఎక్కువగా సంధించేది. అయితే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు అనంతరం బీజేపీ హవా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు పోటీ బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యే అన్నట్లుగా మారింది. పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రెండు పార్టీలే జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనలోనూ ముందున్నాయి. కాషాయ పార్టీ మాత్రం ఎన్నికల సమరానిక క్షేత్ర స్థాయిలో దూసుకెళ్లడం మానేసి.. ఆలస్యం మా వ్యూహం అని ఒకరంటుంటే.. ప్రచారం చేయకుండానే మేమే ప్రచారంలో ముందున్నామని మరొకరు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.
తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు (బుధవారం) తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేస్తామని తెలిపారు. బీసీ సీఎం ప్రకటనపై అనూహ్య స్పందన వస్తోందన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. వివేక్ వెంకటస్వామిపై గత ఆరు నెలల నుంచి విూడియాలో ప్రచారం చేస్తున్నారని.. కానీ వివేక్ బీజేపీలో ఉంటారని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి చక్కటి మ్యానిఫెస్టో ఇచ్చారన్నారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉంటుందని మరోసారి చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. రాష్ట్రంలో తామే ప్రచారంలో ముందున్నామని, సీట్లు కూడా అలాగే గెలుస్తామని ప్రకటించడం హ్యాస్యాస్పదంగా మారింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం పెల్లుబికుతోంది. ఓ వైపు అభ్యర్థులనూ ఇంకా ప్రకటించలేదు.. మరోవైపు పార్టీ ప్రచార కార్యక్రమాల ప్రణాళికా లేదు.. ఇవేమీ చేయకుండానే స్టేట్ మెంట్లు బాగానే ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ రెండు జాబితాలు ప్రకటించింది. 119 స్థానాలకు గాను 53 మంది ని మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. కానీ కసరత్తు ఏ మేరకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపు జనసేనతో పొత్తు వల్ల కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సెగ్మెంట్లను ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఈ సెగ్మెంట్లను వదులుకోవద్దని బీజేపీ నేతలు పట్టుబట్టుతున్నారు. స్థానిక కమలం నేతల ఆందోళన నిరసన రూపం దాల్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మూడో తేదీన నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలు గడువు పదో తేదీ వరకూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే చివరి రోజూ వరకూ కొన్ని సీట్లలో బీజేపీ అగ్రనేతలు హైరానా పడక తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పరిస్థితులు ఇలా ఉంటే.. నాయకులు ప్రకటనలు అలా ఉండడం పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ ఇంకా ప్రచారమే మొదలుపెట్టలేదు. అగ్రనాయకులతో మూడు, నాలుగు సభలు మినహా రాష్ట్ర నాయకత్వం తిరిగింది లేదు. అభ్యర్థుల తరఫున ప్రచారాలు అంతంత మాత్రమే. ఓవైపు బీఆర్ ఎస్, కాంగ్రెస్ లు ప్రచారంలో దూసుకెళ్తుంటే.. పోటీ ఇచ్చేందుకు కార్యకర్తలను సిద్ధం చేయాల్సిన నేతలు పత్తాక లేకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇది ఎటువంటి ఫలితాలను తీసుకొస్తుందో చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ