నేర చరిత్ర ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి రారు కానీ.. ప్రజలను ఏలడానికి మాత్రం పని కొస్తారంటూ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతోన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నవారిలో చాలామంది నేరచరిత్ర కలిగినవాళ్లేనట. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు.
అవును.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులలో.. చాలా మంది నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారని.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభరెడ్డి చెప్పారు. అందుకే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందే.. తమ అభ్యర్థుల నేర చరిత్రను తెలుసుకుని ఓటేయాలని సూచించారు. తాజాగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను బయటపెట్టారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భారతీయ జనతా పార్టీ 111 స్థానాలలో, కాంగ్రెస్ 118 స్థానాలలో, ఎంఐఎం 12 స్థానాల్లో అభ్యర్థులను దింపాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల నేర చరిత్రను వివరిస్తూ, వారిపై ఉన్న కేసులను బయట పెట్టారు. ఈ ఎన్నికలలో నాలుగు పార్టీలలో పోటీ చేస్తున్న కేండిడేట్స్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మంది అభ్యర్థులపైన కేసులు ఉన్నట్లు వివరించారు. అంటే 71 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు.
ఆ తర్వాత 78 మంది బీజేపీ అభ్యర్థుల పైన కేసులు ఉన్నట్లు అంటే 70 శాతం మంది నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరించింది. అలాగే ఎంఐఎం పార్టీ అభ్యర్థుల్లో ఆరుగురిపైన కేసులున్నట్లు ఆ పార్టీలో 50శాతం మందిపై కేసులు ఉన్నట్లు తేల్చింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నవారిలో 58 మంది అభ్యర్థులపైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు.. అంటే గులాబీ దళంలో ఇప్పుడు పోటీ చేస్తున్న 48 శాతం క్రిమినల్ రికార్డ్స్ కలిగి ఉన్నట్లు వివరించారు.
119 నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నిలబడ్డ 360 మందిలో.. ఏకంగా వారిలో 226 మందికి నేర చరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరించింది. అయితే ఈ నేర కేసుల్లో సగం మందిపై భూ ఆక్రమణ, బెదిరింపులు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అయితే వీటితో పాటు తెలంగాణ ఉద్యమం సందర్భంగా కొన్ని కేసులు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినపుడు కొన్ని కేసులు నమోదయినట్లు వివరించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి రాజాసింగ్పై అందరికంటే ఎక్కువగా 89 చొప్పున కేసులు ఉన్నాయి. ఆ తర్వాత బండి సంజయ్పై 59 కేసులు, ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుపై 52 కేసులు, ఈటల రాజేందర్పై 44 కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE