ప్రచారంలోనా.. తగ్గేదేలే. డబ్బు పంపకంలోనా.. తగ్గేదేలే. చేరికల్లోనూ తగ్గేదేలే. తెలంగాణలో ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల వేళ కొన్నిచోట్ల టఫ్ ఫైట్ నడుస్తోంది. గెలుపోటములు ఎవరి అంచనాలకూ అందడం లేదు. ప్రతి ఒక్కరూ ప్రముఖ నేతలతో నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తూ, భారీగా జనాన్ని సమీకరిస్తూ ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీలో ఉంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీపీఐకు కేటాయించింది. భారతీయ జనతా పార్టీ 111 సీట్లలో పోటీ చేస్తూ.. పొత్తులో భాగంగా జనసేకు 8 సీట్లు కేటాయించింది.
రాష్ట్రం మొత్తంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తోంది. అక్కడ గెలుపోటములను అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో అలాంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. వాటిలో నాంపల్లి, ఖైరతాబాద్, మహేశ్వరం, మల్కాజిగిరి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఉన్నాయి. అలాగే ఖమ్మం, పాలేరు, కామారెడ్డిలలో టఫ్ ఫైట్ నడుస్తోంది. కల్వకుర్తి, హుజూర్నగర్, ములుగు, ఇబ్రహీంపట్నం, మెదక్, జూబ్లీహిల్స్లలో హోరాహోరీ నడుస్తోంది. పోలింగ్కు మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆయా పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటేందుకు జోరుగా తిరుగుతున్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్షోలతో ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు.
అయితే పార్టీ అధినాయకుల ప్రచారంతోపాటు ఆయా స్థానాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు గెలుపు కోసం ఎవరికి వారుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ సెగ్మెంట్లలో పట్టు సాధించాలనే ధృడ సంకల్పంతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రచారంలో తమవెంట తిరుగుతున్న కార్యకర్తలు, నాయకుల భోజనాలు మొదలుకుని ఇతర పార్టీల నుంచి వస్తున్న వారిని చేర్పించుకునే వరకు ఖర్చుకు ఎవరూ వెనకాడడం లేదు. నువ్వా.. నేనా.. అనే స్థాయిలో పోట్లాడుతుండడంతో రాజకీయం మరింత వేడెక్కింది.
గ్రేటర్ హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో గెలుపు కోసం అభ్యర్థులు లెక్కకు మించి ఖర్చు పెడుతున్నారు. తొలి సారిగా పోటీచేస్తున్న అభ్యర్థులతోపాటు ఇప్పటికే ఒకటి, రెండు సార్లు గెలుపొందిన, గతంలో ఓటమి చెందిన వారు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాలను నిలుపుకునేందుకు ఎమ్మెల్యేలు నిర్విరామంగా కృషి చేస్తుండగా, వారి సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలనే వ్యూహంతో ఇతర అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఒక్కో అభ్యర్థి రోజుకు రూ.50 లక్షల నుంచి 60 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇక పంపిణీఆ లెక్క వేరే ఉంది. కనీసం ఒక్కో ఓటరుకు రూ.2 వేల నుంచి 3వేలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE