తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు నిర్వహించే “జనతా కర్ఫ్యూ” లో ప్రజలు అందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనతా కర్ఫ్యూ వంటి పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం.
- ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపు.
- రేపు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు సేవల నిలుపుదల.
- వేరే రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు కూడా 24 గంటల పాటు రాష్ట్రంలోకి రావద్దని విజ్ఞప్తి.
- హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు నిలుపుదల.
- కూలీలు కూడా రేపు ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దు.
- ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే దేశానికి సేవ చేసినట్టే.
- జనతా కర్ఫ్యూను 24 గంటల పాటు పాటించి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి.
- జనతా కర్ఫ్యూ నిర్వహిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై దుష్ప్రచారం సాగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం.
- ప్రధాని పిలుపు మేరకు రేపు సాయంత్రం ఐదు గంటలకు నేను, నా కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు చప్పట్లు కొట్టి కరోనాపై పోరాడుతున్న వారికి, డాక్టర్లకు సంఘీభావాన్ని తెలియజేసి ఐక్యత చాటుతాం.
- సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకుల వలన కరీంనగర్ పట్టణంలో ఎవరికి వైరస్ సోక లేదు.
- 60 మంది మత ప్రచారకులను ఇప్పటికే గుర్తించి క్వారంటైన్ కు తరలించి పర్యవేక్షిస్తున్నాం.
- రాష్ట్రంలో కరోనా వలన పరిస్థితి విషమిస్తే అన్నీ మూసివేసి ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తోంది.
- ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రజలు నయాపైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటుంది.
- రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు, కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
- ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపేయాలని, అలాగే ఎయిర్ పోర్టులు, పోర్టులు మూసివేయాలని సూచించాం.