దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (డిసెంబర్ 14, బుధవారం) ఘనంగా ప్రారంభించారు. ముందుగా బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జాతీయ అధ్యక్షుని ఉచితాసనంను సీఎం కేసీఆర్ స్వీకరించి ఆశీనులయ్యారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైన సందర్భంగా సీఎం కేసీఆర్ కు వారంతా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. కార్యాలయం ప్రారంభంతో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి.
అలాగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు బుధవారం ఉదయం ప్రాంగణంలో నిర్వహించిన నవ చండీహోమం, రాజశ్యామల హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ పూజా కార్యక్రమాల్లో అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరుకాలేకపొయ్యారు. ముందే షెడ్యూల్ చేయబడిన రెండు కీలక పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో, సీఎం కేసీఆర్ ప్రత్యేక అనుమతితో ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లుగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE