మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ కన్నుమూశారు, ఆయన వయసు 60 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ను ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేశ్ గౌడ్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1989, 2004 ఎన్నికలలో మహారాజ్ గంజ్ నుంచి, 2009లో గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
వై.ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో, 2007 లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసారు. 2009 లో మరోసారి మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు సేకరించి, ఐదు సంవత్సరాలు పాటు నిర్వహించారు. అయితే 2014 మరియు 2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా గోషామహల్ నియోజక వర్గంనుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ చేతిలో పరాజయం పొందారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసారు, నియోజక వర్గంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా మంచి పేరు గడించారు.