భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడిఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఆధార్ సేవా కేంద్రం, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఏర్పాటు చేయబడింది. నవంబర్ 27, బుధవారం నుంచి మాదాపూర్ విఠల్రావునగర్ లోని ఈ ఆధార్ సేవా కేంద్రంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రతి రోజు 1000 వరకు ఆధార్ నమోదు, ఆధార్ కార్డుల్లో మార్పులు (చిరునామా, పేరు, జెండర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, ఫోటో, వేలిముద్ర, ఐరిస్) చేపట్టే విధంగా ఏర్పాట్లు చేసినట్టు సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో పూర్తిస్థాయి ఆధార్ సేవా కేంద్రం ఇదే మొదటిదని తెలిపారు.
యూఐడిఏఐ ఆన్లైన్లో అపాయింట్మెంట్ పోందే సదుపాయాన్ని కూడా కల్పించింది, ask.uidai.gov.in ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ప్రజలు వారికీ కావాల్సిన సేవలు పొందవచ్చు. ఈ ఆధార్ సేవా కేంద్రం ఆదివారం సహా వారంలోని మొత్తం 7 రోజులలో ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 వరకు అందుబాటులో ఉంటుంది. 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఆధార్ నమోదు మరియు బయోమెట్రిక్ నవీకరణ పూర్తిగా ఉచితం, అలాగే ఇతర మార్పులకు రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేంద్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నివాసితులతో పాటు, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆధార్ సంబంధిత సేవలను పొందవచ్చు.
[subscribe]