తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 28, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ప్రగతి భవన్ లో మొదలైన ఈ సమావేశం ఆర్టీసీ సమస్యే ప్రధాన అజెండాగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమస్యకు పూర్తీ స్థాయిలో ముగింపు ఇచ్చే దిశగా చర్చించవలసి ఉండడంతో ఈ సమావేశం శుక్రవారం కూడ కొనసాగే అవకాశం ఉంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను ఆర్టీసీ కార్మికులు నవంబర్ 25న విరమించారు. ఈ నేపథ్యంలో వారిని విధుల్లోకి తీసుకునే అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.
సుమారు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధపడినా, ప్రభుత్వం వారిని అనుమతించడంలేదు. ఆర్టీసీ అంశం వేలమంది కార్మికుల భవిష్యత్ తో ముడిపడి ఉండడంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేసే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రూట్లలోనే ప్రైవేటీకరణకు అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. రూట్ల ఎంపిక ప్రక్రియపై మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
[subscribe]