బలహీన వర్గాల కోసం, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం మహత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, బలహీన వర్గాల కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. దేశ పౌరుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే బేధాభిప్రాయాలు రూపుమాపడానికి పూలే పాటు పడ్డారని చెప్పారు.
రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బీసీల ఎదుగుదల కోసం బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశామని, అంతేగాక బడ్జెట్ లో బీసీల సంక్షేమం కోసం 15వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్టంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులలో నలుగురు బలహీన వర్గాలకు చెందిన వారేనని సీఎం గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు తెచ్చామని చెప్పారు. చంద్రబాబు పోతూ పోతూ అప్పులు పెట్టిపోయాడని, అయినా కూడా వెనకడుగు వేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం వైఎస్ జగన్ వివరించారు.
[subscribe]