ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 29, మంగళవారం నాడు కూడ వాడీవేడిగా వాదనలు జరిగాయి. కార్మికుల సమ్మె, ఆర్టీసీ బకాయిల అంశం, ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు, రియంబర్స్మెంట్ బకాయిలు తదితర అంశాలపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను నవంబర్ 1వ తేదికి వాయిదా వేసింది. బకాయిలకు సంబంధించిన పూర్తీ వివరాలను అక్టోబర్ 31వ తేదీ లోపు కోర్టుకు అందించాలని ఆర్టీసీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రోజున ఆర్థికశాఖ కార్యదర్శి కోర్టుకు రావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జీహెఛ్ఎంసీ ఇవ్వాల్సిన బకాయిలు, ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిన నిధుల పూర్తీ వివరాలను కోర్టు ప్రశ్నించింది. కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్పష్టంగా లేని నివేదిక ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఆర్టీసీకి రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1099 కోట్లు ఉన్నాయని, 48శాతం తెలంగాణ, 52 శాతం ఏపీ చెల్లించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.4,235 కోట్లు ఇచ్చామని చెప్పారు. సోమవారం విచారణ సందర్భంగా చర్చించిన నాలుగు డిమాండ్లకు సంబంధించి రూ.47 కోట్లు ప్రభుత్వం ఇస్తుందా, లేదా? అని కోర్టు ప్రశ్నించగా, వెంటనే ఇవ్వలేమని గడువు ఇస్తే ప్రయత్నిస్తామని ఏజీ తెలిపారు. ఏజీ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం, హుజూర్నగర్ ఒక్క నియోజకవర్గానికే రూ.100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వం, ప్రజల ఇబ్బందులును తొలగించడానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా, ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మొత్తం బస్సుల సంఖ్య, ప్రస్తుతం ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించగా, 75శాతం బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపిన సమాధానంతో కోర్టు ఏకిభవించలేదు. ఇప్పటికీ మూడో వంతు బస్సులు కూడ నడవడం లేదని హైకోర్టు పేర్కొంది.
[subscribe]