బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిషేధం విధించింది. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదని ప్రకటించారు. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం చేసిన మూడు వేర్వేరు ఆరోపణలను షకీబుల్ హసన్ అంగీకరించడంతో ఒక సంవత్సరం పూర్తిగా నిషేధం, మరో సంవత్సరం పాటు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీబుల్ను బుకీలు సంప్రదించిన నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి సమాచారం ఇవ్వకపోవడంతోనే చర్య తీసుకున్నట్లుగా ఐసీసీ ప్రకటించింది. ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలో నిబంధన 2.4.4 ప్రకారం ఎవరైనా బుకీలు ఆటగాళ్లను సంప్రదించినపుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా సమాచారం అందించాలి, ఎంత ఆలస్యం చేస్తే శిక్ష అంత కఠినంగా మారే అవకాశం ఉంది. 2.4.4 నిబంధన ప్రకారం ఆరు నెలల నుంచి, అత్యధికంగా ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు.
బంగ్లాదేశ్ టెస్టు, టీ20 సారథిగా వ్యవరిస్తూ, ఆ జట్టు విజయాల్లో చాలా కాలం నుంచి కీలక పాత్ర పోషిస్తున్న షకిబ్ అల్ హసన్పై ఐసీసీ నిషేధం విధించడంతో క్రికెట్ అభిమానులతో పాటు, యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. అయితే ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆల్రౌండర్ షకీబుల్ హసన్కు అండగా నిలిచారు. షకీబుల్ చేసిన పొరపాటు ఒప్పుకున్నాడని, ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ, బీసీబీ కానీ ఏమి చేయలేదని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో షకీబుల్కు అండగా ఉండాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నిషేధం వలన షకీబుల్ ముఖ్యమైన టీ20 ప్రపంచకప్, వచ్చే ఐపీఎల్ తో పాటు కొన్ని ఇతర టోర్నీలకు దూరమవుతాడు. మళ్ళీ అక్టోబర్ 29, 2020 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఐసీసీ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాను, నాలాగా యువక్రికెటర్లు ఇటువంటి తప్పులు చేయకుండా ఐసీసీతో కలిసి పనిచేస్తానని షకీబుల్ ప్రకటించాడు.