తెలంగాణలో టికెట్ల లొల్లి షూరూ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గులాబీ బాస్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చేశారు. ఆశావాహులకు.. పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించారు. దీంతో చాలా కాలంగా బీఆర్ఎస్లో ఉన్న కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. మరోవైపు రెండు.. మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం అభ్యర్థులను ఖరారు చేయడం పెద తలనొప్పిగా మారింది.
ఇప్పటికే రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ రెండు సార్లు సమావేశం అయింది. ఈరోజు చివరి సారిగా ఢిల్లీలో సమావేశమై అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనుంది. అయితే ఇప్పటికే టికెట్ ఖారైన వారి కొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఆశావాహులు, సీనియర్లు అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీటు తమకే ఇవ్వాలని మొండిపట్టు పట్టుకొని కూర్చున్నారు. మరికొందరు ఆందోళనకు దిగేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
టికెట్ల పంచాయితీ..
నాగర్ కర్నూల్ నుంచి ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎవరంటే నాగం జనార్ధన్ రెడ్డి. ఈసారి కూడా నాగర్కర్నూల్ నుంచి తానే పోటీ చేస్తానని ముందు నుంచి జనార్థన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. కానీ ఇటీవల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈక్రమంలో రాజేష్ రెడ్డికి టికెట్ ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జనార్థన్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. అటు వనపర్తిలో మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. మేఘారెడ్డి కూడా ఇప్పటి నుంచే జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఆ టికెట్ కోసం సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం వద్దకు వెళ్లి నాగర్ కర్నూల్ టికెట్ తనకే ఇవ్వాలని పట్టుపట్టుకొని కూర్చున్నారు.
పాలేరు టికెట్ దక్కేదెవరికి?
ఇక కొత్తగూడెం నుంచి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని ముందు నుంచి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పాలేరు నుంచి పోటీ చేయాలని శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించుకున్నారట. దీంతో పెద్ద చిక్కొచ్చి పడింది. పాలేరు నుంచి పోటీ చేసేందుకు ముందు నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తి కనబర్చుతున్నారు. ఇప్పుడు పొంగులేటి ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. ఆదిష్టానం తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ నెలకొంది పాలేరు టికెట్ పొంగులేటికి ఇస్తుందా? లేదా తుమ్మలకు ఇస్తుందా? అనేది చర్చనీయాంశమయింది.
రంగంలోకి సీనియర్లు
ఇకపోతే అసంతృప్తులకు సర్దిచెప్పేందుకు అధిష్టానం సీనియర్ నేతలను రంగంలోకి దింపుతోంది. సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్, వీరప్ప మెయిలీ వంటి నేతలను రంగంలోకి దిగుతున్నారు. అవసరమయితే చివరి నిమిషంలో సీనియర్ నేత చిదంబరం కూడా రంగంలోకి దిగనున్నారట. అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి ముందే వీరు తెలంగాణకు రానున్నారట. అసంతృప్తులను కలిసి బుజ్జగించనున్నారట. వారిని సంతృప్తిపరిచేలా పదవులు ఇస్తామని భరోసా కల్పించనున్నారట.