యుద్దాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఓ వైపు ఏడాదిన్నరకు పైగా ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం కొసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇంతలోనే ఓ దేశంతో ఓ చిన్నపక్షం పోట్లాటకు దిగింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ది చెందిన దేశాల వద్ద కూడా లేని అత్యాధునికమైన ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. అయినప్పటికీ హమాస్ చేతిలో ఇజ్రాయెల్ చిగురుటాకులా వణికిపోతోంది. ఇజ్రాయెల్పై హమాస్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. తూర్పు జెరూసలెంలోని అల్-అఖ్సా కేంద్రంగా ఈ యుద్ధం జరుగుతోంది.
హమాస్ అంటే ఏమిటి?
1987లో గాజా, వెస్ట్బ్యాంక్, తూర్పు జెరుసలెంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిఫదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలో హమాస్ అనే సంస్థను షేక్ అహ్మద్ యాసిన్ అనే వ్యక్తి నెలకొల్పారు. దీని పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా. ఒక చిన్న బృందంగా ఏర్పడిన ఈ సంస్థ.. క్రమక్రమంగా ఓ ముస్లీం బ్రదర్ హుడ్ అనే సంస్థకు రాజకీయంగా మద్ధతు తెలిపే స్థాయికి వెళ్లింది. 1988లో హమాస్ తన చార్టర్ను ప్రకటించింది. ఇజ్రాయెల్ను నాశనం చేసి.. ఒకప్పటి పాలస్తీనాను పునరుర్ధించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చార్టర్లో హమాస్ పేర్కొంది.
వెస్ట్బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో 1993లో పరిమిత స్వయంపాలిత ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్జాక్ రాబిన్, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ మధ్య జరిగిన ఓస్లో ఒప్పందంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ఒప్పందాన్ని హమాస్ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈక్రమంలో ఒస్లో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ హమాస్ దాడులకు కూడా దిగింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
దాడులకు కారణం ఏంటి?
అల్ అఖ్సా వద్ద ఒకప్పుడు రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి. కానీ అవి కాలక్రమేనా యుద్ధాల్లో ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొందరు యూదు అతివాదులు 1990లో అక్కడ తిరిగి ఆలయాలను పునర్మించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత నుంచి ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించారు. యూదులు, క్రిస్టియన్లకు మాత్రం కేవలం ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి మాత్రమే అనుమతించారు. అక్కడ ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు.
ఈక్రమంలో తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్లోని యూదు మతసంస్థలు ఆందోళనకు దిగాయి.ఇజ్రాయెల్ భద్రతా బలగాల సాయంతో.. యూదు అతివాదులు అల్ అఖ్సా ప్రాంగణానికి వెళ్లారు. ఈ దాడుల్లోకి హమాస్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి హమాస్ ఇజ్రాయెల్పైకి దండయాత్రకు దిగింది.
హమాస్కు అండగా ఆ దేశం..
హమాస్ క్రమక్రమంగా తన బలాన్ని, బలగాన్ని విస్తరించుకుంటూ పోతోంది. ఆ సమయంలో హమాస్కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అనుమానలు వ్యక్తమయ్యాయి. దీనిపై కొందరు రహస్యంగా అన్వేషణ కొనసాగించి సంచనల విషయాలు బయటపెట్టారు. హమాస్కు ఇరాన్ దేశం అండగా ఉన్నట్లు తేలింది. ప్రతి ఏటా హమాస్కు ఇరాన్ 10 కోట్ల డాలర్లు అందిస్తుందట. అలాగే కొందు పాలస్తీనా వాసులు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. వారు కూడా డొనేషన్ల రూపంలో కోట్ల రూపాయలు హమాస్కు అందిస్తున్నారట.