తెలంగాణలో బీజేపీకి ఆదరణ తగ్గుతూపోతోంది. పార్టీలో ఇంటర్నల్ సమస్యలు.. చేరికలు.. సీనియర్లను పక్కనపెట్టడం వంటి కారణాలతో బీజేపీ వెనక్కిపడిపోయింది. గత కొద్ది వారాలుగా బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. ఇక తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది.. ఈసారి డిపాజిట్లు కూడా దక్కవు అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇటు కేసీఆర్, అటు కాంగ్రెస్ నేతలను ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలని కోరారని మోడీ బాంబు పేల్చారు. అలాగే పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ వారం బీజేపీ గ్రాఫ్ కాస్త పుంజుకుంది.
ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నట్లుగా.. ప్రతివారంలానే ఈ వారం కూడా తెలంగాణ ఇంటెన్షన్స్ సంచలన సర్వే నివేదిక వచ్చేసింది. ఈ నివేదిక ప్రకారం బీఆర్ఎస్ గ్రాఫ్ యాధావిధిగా కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ గ్రాఫ్ మాత్రం కొంచెం పడిపోగా.. బీజేపీ గ్రాఫ్ కాస్త పెరిగింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 40 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. గత వారంతో పోలిస్తే ఈవారం బీఆర్ఎస్ గ్రాఫ్లో ఎటువంటి మార్పు లేదు. అటు కాంగ్రెస్కు 34 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. పోయిన వారం కాంగ్రెస్కు ఓట్లు పడే అవకాశం 35 శాతం ఉండగా.. ఈవారం అది ఒక శాతం తగ్గి.. 34 శాతంగా ఉంది.
ఇక బీజేపీకి ఓట్లు పడే అవకాశం 10 శాతంగా ఉంది. పోయిన వారంతో పోలిస్తే ఈవారం 2 శాతం పెరిగింది. ఇక ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే హంగ్ ఏర్పడే అవకాశం 7 శాతంగా ఉంది. పోయిన వారం హంగ్ ఏర్పడే అవకాశం 6 శాతంగా ఉండగా.. ఈవారం ఒక శాతం పెరిగింది. అలాగే బీఆర్ఎస్కు కాకుండా బీజేపీకి లేదా కాంగ్రెస్కు పడే ఓట్లు ఈవారం 9 శాతంగా ఉన్నాయి. పోయిన వారం ఈ ఓట్లు 11 శాతండా ఉండగా.. ఈవారం 2 శాతం తగ్గాయి.
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారికి దగ్గరగా ఉంటున్నారు. అలాగే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ పోతున్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ గ్రాఫ్లో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతానికి ముందంజలో కొనసాగుతున్నప్పటికీ.. ఈ జోరు సరిపోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు మొన్నటి వరకు వేగంగా దూసుకొచ్చిన కాంగ్రెస్ ఒక్కసారిగా చితకలబడింది. ఈవారం కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది. ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించకుండా.. నాన్చుతూ రావడం వల్లే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గినట్లు తెలుస్తోంది. అటు మోడీ, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫలితంగా బీజేపీ గ్రాఫ్ 2 శాతం పెరిగింది.
ఇకపోతే ఎన్డీయే కూటమిలో భాగమయ్యేందుకు సీఎం కేసీఆర్ తనను సంప్రదించారని నిజామాబాద్ సభలో మోడీ పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ప్రతిపాదనను తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రవ్యాప్తంగా 27 శాతం మంది ఓటర్లు విశ్వసిస్తున్నారని నివేదిక తెలిపింది. అలాగే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్.. మోడీ ఆశీర్వాదం కోసం ప్రయత్నించారనే అంశాన్ని 9 శాతం మంది ఓటర్లు నమ్ముతున్నారని నివేదిక స్పష్టం చేసింది. అటు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు కేసీఆర్ నిధులు ఇచ్చారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను 34 శాతం మంది ఓటర్లు విశ్వసిస్తున్నారని నివేదికలో తేలింది.