మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వారి కార్యాలయాల్లో అక్టోబర్ 11, శుక్రవారం ఉదయం ఆరు గంటలనుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మేఘా కృష్ణారెడ్డి సంస్థలకు సంబంధించి, ట్యాక్స్ ల విషయంలో అవకతవకలు జరిగాయనే సమాచారంతోనే ఐటీ శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్ వింగ్ తనిఖీలు చేపడుతునట్టు సమాచారం. చేపడుతున్న సోదాల గురించి వివరాలు తెలియజేసేందుకు ఐటీ శాఖ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది, సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
మరో వైపు తమ సంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాలపై మేఘా సంస్థ కూడా స్పందించింది. ఇవి ఐటీ దాడులు కాదని, సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నారని గుర్తించాలని మేఘా సంస్థ పేర్కొంది. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ఐటీ శాఖ అధికారులు ఇలా తనిఖీలు నిర్వహించడం చాలా సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారమే అని సంస్థ తెలిపింది. మేఘా సంస్థ ఇటీవల రివర్స్ టెండెరింగ్ లో పోలవరం ప్రాజెక్టు పనులు చేజిక్కుంచుకుంది, అదే విధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడ పాలుపంచుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడ భారీ ప్రాజెక్టులు చేపడుతున్న తరుణంలో మేఘా సంస్థపై ఐటీ దాడులతో మరొకసారి వార్తల్లో నిలిచింది.
[subscribe]