కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మాజీ మంత్రి, ఎంపీ జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఐటీ శాఖ అధికారులు అక్టోబర్ 10 గురువారం నాడు సోదాలు నిర్వహించారు. ఐటీ శాఖకు చెందిన దాదాపు 300 మంది అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే జి.పరమేశ్వర, ఎంపీ జాలప్ప కొడుకు రాజేంద్రకు సంబంధించిన ఇళ్లు, పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జి.పరమేశ్వరను ఐటీ అధికారులు దాదాపు 11 గంటల పాటు విచారించినట్టు తెలుస్తుంది. ఆయనకు దేశంలో, మరియు విదేశాల్లో వ్యాపారాలలో భాగంగా పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
పరమేశ్వర, ఆర్.ఎల్. జాలప్పకు చెందిన విద్యాసంస్థల్లో నీట్ పరీక్షలకు సంబంధించి, ముడుపుల వసూళ్లు మరియు పన్నువేగవేత పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. పరమేశ్వరతో పాటు ఆయన సోదరుడైన జి.శివప్రసాద్, అతని వ్యక్తిగత సహాయకుడు రమేశ్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో కుడా సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా ఐటీ శాఖ సుమారు 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం నాడు ప్రకటించారు. గురువారం నాడు ప్రారంభమైన సోదాలు సుమారు 25 చోట్ల కొనసాగుతున్నాయని వారు తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులపై వరుసపెట్టి ఐటీ దాడులు జరుగుతుండడంతో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, యడియూరప్ప పభుత్వంపై విరుచుకు పడింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ దాడులకు పాల్పడుతుందని కర్ణాటక పీసీసీ నాయకులు విమర్శిస్తున్నారు.
[subscribe]