మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేపట్టాలని కొల్లు రవీంద్ర నిర్ణయించుకోవడంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో దీక్షను భగ్నం చేస్తూ, కోనేరు సెంటర్కు చేరుకున్న రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మచిలీపట్నంలో ఎటువంటి దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు.
కొల్లు రవీంద్ర 36 గంటల దీక్ష ప్రకటించడంతో, ముందుగా గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని, అప్పటికే వేరే మార్గంలో కొల్లు రవీంద్ర కోనేరు సెంటర్ కు చేరుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన పోలీసుల తీరును తప్పుపట్టారు, ఇసుక దొరక్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్న కూడ పోలీసులు అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. మరో వైపు రవీంద్ర చేపట్టే నిరసన దీక్షకు వెళ్లకుండా, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని పోలీసులు ఉదయమే గృహ నిర్బంధం చేశారు.
[subscribe]