టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి? ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. జగన్ వ్యవహారశైలి ఎవరి విశ్లేషణకు అర్ధంకాని తీరుగా ఉందని, ఈ రాష్ట్రము జగన్ జాగీరు కాదని అన్నారు. జగన్ కనీసం చట్టాలను కూడ గౌరవించడం లేదని, చట్టాలను తన చుట్టాలుగా మార్చుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తానొక్కడే నీతిపరుడు అనే చందంగా జగన్ వ్యవహార శైలి ఉంటుందన్నారు.
పేద ప్రజలకు ఆకలితీర్చే అన్నక్యాంటీన్లను మూసేశారని ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత వలన లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడి జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. 2003 లోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలు ప్రారంభించామని, ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా చేసింది ఏమిలేదని విమర్శించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా జాతిపిత మహాత్మ గాంధీ ఆశయాలు, విధానాల స్పూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
[subscribe]