తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆదివారం నాడు ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు విడిచారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ తీరు పట్ల మనస్థాపం చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్కు తరలించగా, కంచన్బాగ్లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి మృతితో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, టిజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మందకృష్ణ మాదిగ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆస్పత్రి వద్దకు చేరుకుని శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీనివాసరెడ్డి మృతి చెందడంతో సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.
మరో వైపు ఆదివారం రాత్రి హైదరాబాద్ లో కండక్టర్ సురేందర్ గౌడ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిర్మల్ కు చెందిన సురేందర్ గౌడ్ 14 సంవత్సరాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్నారు. రాణిగంజ్-2 డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సురేందర్ గౌడ్ ఉరి వేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. సురేందర్గౌడ్ మృతదేహానికి ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. బీజేపీ నేత లక్ష్మణ్ సురేందర్గౌడ్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అలాగే నర్సంపేట డిపోకు చెందిన బత్తుల రవి అనే ఆర్టీసీ డ్రైవర్ కూడ ఆదివారం ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న సహచర కార్మికులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.
[subscribe]