తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి వచ్చిన వాళ్లకే కొత్త కమిటీల్లో చోటు కల్పించారని, సీనియర్లను విస్మరించారని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. శనివారం వారు సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క ఇంటిలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇటీవల చేపట్టిన పీసీసీ కమిటీల కూర్పు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలోని అంతర్గత సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. ఇక ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఇతర సీనియర్ నేతలు కోదండ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ను రక్షించుకునే బాధ్యత సీనియర్లపై ఉందని, తామందరం చివరి వరకూ కాంగ్రెస్లోనే ఉంటామని స్పష్టం చేశారు. అయితే పార్టీలో సీనియర్లకు సరైన గౌరవం దక్కడం లేదని, బయటినుంచి వచ్చినవారికి పదవులు లభిస్తున్నాయని ఆరోపించారు. ఇక కమిటీల నియామకంలో తమకు కనీస సమాచారం లేదని, కొంతమందిని అవమానపర్చేందుకే కమిటీలు నియమించారని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన కమిటీల్లో 108 మందిలో 54 మంది వలస నేతలేనని, అందుకే కమిటీల కూర్పుపై మరోసారి హైకమాండ్ను కలుస్తామని తెలిపారు. అసలైన కాంగ్రెస్ నేతలను కోవర్టులని ప్రచారం చేస్తున్నారని, దీనిని కొందరు పనికట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వీరందరూ గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో పార్టీకి అన్యాయం చేస్తున్నారని, ఆయనకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యమ్ ఠాకూర్ మద్దతు ఇస్తున్నారని గుర్రుగా ఉన్నారు. దీంతో వీరిపై మరోసారి అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ