తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ (టీఆర్ఎస్) తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొత్తం 12 స్థానాలకు గానూ ఏడు స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్సీలైన పట్నం మహేందర్రెడ్డి, కల్వకుంట్ల కవిత, టి.భానుప్రసాద్రావు, కూచికుళ్ల దామోదర్రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిలకు మళ్ళీ అవకాశం కల్పించగా, మిగతా ఐదు స్థానాల్లో వంటేరి యాదవరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎల్.రమణ, దండె విఠల్, తాత మధులకు కొత్తగా అవకాశం ఇచ్చారు.
కాగా సోమవారం నాడే ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా స్థానం నుంచి పట్నం మహేందర్రెడ్డి, సుంకరి రాజు, వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఖమ్మం నుంచి తాతామధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి నామినేషన్లు వేశారు. ఇక ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు నవంబర్ 23, మంగళవారం నాడే చివరిరోజు కావడంతో, మిగిలిన వారంతా నేడు నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్ లో దండె విఠల్, నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్లో కూచికుంట్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్లో ఎల్.రమణ, భానుప్రసాద్ రావులు నామినేషన్లు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మెదక్, ఖమ్మంలో మాత్రమే అభ్యర్థులను బరిలో ఉంచింది. మరోవైపు నామినేషన్ల పరిశీలన నవంబర్ 24న చేపట్టనుండగా, ఉపసంహరణకు నవంబర్ 26 వరకు అవకాశమిచ్చారు. ఇక డిసెంబర్ 10వ తేదీన ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ