తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా పేషెంట్ లకు అందుతున్న ఆక్సిజన్ సరఫరాపై సుదీర్ఘంగా సమీక్షించారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా వాటి పనుల పురోగతిపై చర్చించారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్, నిమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా, కింగ్ కోటి, టిమ్స్ హాస్పిటల్, మహబూబ్ నగర్ హాస్పిటల్ లో తాజాగా ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాట్లు పూర్తి అయింది. సిద్దిపేట, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిల్లో మరో వారం రోజుల్లో ఆక్సిజన్ ఏర్పాటు పూర్తి కానుంది, మిగిలిన చోట్ల మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు మంత్రికి వివరించారు.
రాష్ట్రంలో లక్ష కేసులు నమోదైతే 15వేల మందికి అడ్మిషన్ అవసరమవుతుందని, అందులో పది వేల మందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఐదు వేల మందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందేలాగా పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగేలా చూడాలని మంత్రి ఈటల రాజేందర్ మరోమారు ఆదేశించారు. గ్రామాల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉండే అవకాశాలు తక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఐసొలేషన్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని, వాటిలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు, మందులు, కిట్లు, డిస్పోజబుల్ కొరత లేకుండా చూడాలని కోరారు.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 అంబులెన్సులు వైద్య ఆరోగ్య శాఖకు అందిస్తున్న నేపధ్యంలో వాటి సర్వీసును పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఈరోజు మంత్రి ఆదేశించారు. కరోనా వైరస్ తో పాటుగా ఇతర వ్యాధుల చికిత్సపై కూడా ఆస్పత్రుల్లో దృష్టిలో పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలి ఉన్న ప్రాంతంలో సాధారణ వైద్య సేవలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చాలా ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు పనిచేయడం లేదని, అసెంబ్లీ వేదికగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య పరికరాలపై ఒక నివేదిక తయారు చేయాలని, ఎక్కడెక్కడ పరికరాలు పనిచేయడం లేదనే వివరాలను తెలియచేయాలని మంత్రి తెలిపారు. పరికరాల మెయింటెనెన్స్ చేయడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu