ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వ్యాక్సిన్ల సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 3, 2021 నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు 10,000 మందికి టీకాలు వేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్ కోటా, అందిన వ్యాక్సిన్లు, అందుబాటులో వున్న వ్యాక్సిన్ నిల్వల గురించి మంత్రి సమీక్షించారు. రాష్ట్రానికి ఎక్కువ వ్యాక్సిన్ డోసులను కేటాయించుటకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
వైద్య పరికరాలను సేకరించడం, ఆక్సిజన్ సరఫరా, స్టోరేజ్ యూనిట్ల ఏర్పాట్లు మరియు థర్డ్ వేవ్ కోవిడ్-19 ప్రభావం నివారణ చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణా శాఖ కమీషనర్ యం.ఆర్.యం. రావు, వైద్య విద్య డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓ.ఎస్.డి.గంగాధర్ మరియు కాళోజి నారాయణ రావు హెల్త్ యునివర్సిటి వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ