తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ రోజు హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ నుండి అన్ని జిల్లాల వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులు, ప్రికాషన్ డోస్/బూస్టర్ డోసు, సీ సెక్షన్లు, ఎన్సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల రోజులు ఎంతో కీలకమని, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. డెంగీ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు ఉన్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని చెప్పారు. ఒకవైపు ప్రజలకు అవగాహన పెంచడంతో పాటుగా మరో వైపు సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకునెలా చూడాలన్నారు.
మున్సిపల్, పంచాయతీ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. నీటి నిల్వ లేకుండా చూడటం, ఫాగింగ్, ఫ్రై డే డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తద్వారా దోమలు, ఈగల నియంత్రణ జరిగేలా చూడాలన్నారు. వర్షాలు, వరదల సమయంలో జిల్లా వైద్యాధికారులు సమన్వయంతో పని చేశారని, స్టాఫ్ నర్సులు, ఆశాలు, ఇతర సిబ్బంది అందరూ కృషి చేసి మంచి సేవలు అందించారని మంత్రి అభినందించారు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంకా బాగా పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతి పీహెచ్సీ లో కుక్క, పాము కాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. సబ్ సెంటర్ల వారీగా జరుగుతున్న ఎన్సీడీ స్క్రీనింగ్ త్వరగా వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
ఇక పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో ప్రికాషన్ డోస్ పంపిణీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రికాషన్ డోస్ చాలా ముఖ్యమని, అర్హులందరికి వేసేలా రాష్ట్ర వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో వాక్సినేషన్ వేగంగా నిర్వహించాలని, ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వారానికి రెండు మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని, వచ్చే పది రోజుల్లో వాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస్ రావును మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో 2,77,67,000 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటి వరకు 12,87,411 మందికి ప్రికాషన్ డోస్ పంపిణీ చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రికాషన్ డోస్ పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. 20 లక్షల పైగా డోసులు నిల్వ ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉందని, అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రత్యేకంగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని డిఎంహెచ్ఓలను మంత్రి ఆదేశించారు. 040-24651119 నెంబర్ లో సంప్రదిస్తే, 100 మంది కంటే ఎక్కువ మంది లబ్దిదారులు ఉన్న చోట వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ విషయంపై ప్రచారం కల్పించాలన్నారు. ఇక ఆర్టిపీసిఆర్ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలన్నారు.
మరోవైపు ప్రతి గర్భిణికి నాలుగు ఏఎన్సీ చెకప్స్ పక్కగా జరిగేలా చూడాలన్నారు. ఈ విషయంలో మంచి పని తీరు నమోదు చేసిన జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, జనగాం, కుమ్రం భీం, సంగారెడ్డి జిల్లాలను మంత్రి అభినందించారు. సూర్యాపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో పనితీరు తక్షణం మెరుగుపడాలన్నారు. సీ సెక్షన్ల విషయంలో అందరం కలిసి కృషి చేస్తున్న నేపథ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. అనవసర సీసెక్షన్లు తగ్గించడంపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో మంచి పనితీరు కనబర్చితున్న నారాయణ్ పేట్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను మంత్రి అభినందించారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో సీసెక్షన్లు బాగా తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంబించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ దేశానికి రోల్ మాడల్ గా నిలిచాయనీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చేసి, మరుసటి రోజు పేషెంట్ ఆ ఫలితాలు వైద్యులకు చూపించే విధంగా ఉండాలన్నారు. ఆసుపత్రుల ప్రదేశంలో ఉండే టి డయాగ్నొస్టిక్ సెంటర్ల బాధ్యత ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తీసుకోవాలన్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సేవల్లో మంచి పనితీరు కనబర్చిన మెదక్ జిల్లాను అభినందించారు. మరమ్మతులు, కొత్త బిల్డింగ్ అవసరం ఉన్న పీహెచ్సీల వివరాలను టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ, డీహెంహెచ్వో మరోసారి సమీక్షించి తుది ప్రతిపాదనలు శుక్రవారంలోగా పంపించాలని మంత్రి మంత్రి హరీశ్ రావు సూచించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు, డీఎంఇ రమేష్ రెడ్డి, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఈ విజయ్ కుమార్, వివిధ అరోగ్య కార్యక్రమాల ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY