తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యనందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పడం జరిగిందన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల సొసైటీలకు చెందిన పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి కొప్పుల శనివారం విడుదల చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా అధికారులతో గంటన్నర పాటు గురుకులాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ గురుకులాలకు పేరు ప్రతిష్టలు ఉన్నాయని, వీటికి మరింత వన్నె తెచ్చేందుకు, బాలబాలికల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు అంకితభావంతో ముందుకు సాగుదామని అధికారులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడేలా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులయ్యేలా మరింత శ్రద్ధ చూపాల్సిందిగా అధికారులకు మంత్రి కొప్పుల దిశానిర్దేశం చేశారు.
48 వేల 440 సీట్లకు లక్షా 47 వేల 924 దరఖాస్తులు:
నాలుగు సొసైటీల ఆధ్వర్యంలో 605 పాఠశాలలు ఉండగా, 5వ తరగతిలో ప్రవేశాల కోసం మే 8వ తేదీన కామన ఎంట్రన్స్ (VTGCET-2022) నిర్వహించారు. మొత్తం 48 వేల 440 సీట్లకు గాను లక్షా 47వేల 924 మంది బాలబాలికలు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఈ సంఖ్య కేవలం 87వేల 773మంది మాత్రమే కావడం గమనార్హం. గురుకులాలలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుండడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కామన్ ఎంట్రన్స్ లో కృతకృత్యులైన బాలబాలికలకు వారి స్వస్థలాలకు చేరువలోని పాఠశాలలోనే సీట్లు లభిస్తున్నాయి.
గురుకులాలు, హాస్టళ్లకు “సహజ” ఉత్పత్తులను సరఫరా చేయండి:
జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు ” సహజ” పేరుతో నిత్యావసరాలను ఉత్పత్తి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు వివరించారు. వీటిలో సబ్బులు, షాంపూలు, తలనూనెలు, కాస్మోటిక్స్ తదితర ఉత్పత్తులు ఉన్నాయని, ఇవి నాణ్యమైనవి, మన్నికైనవి, చౌకైనవని మంత్రి పేర్కొన్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేస్తున్న ఈ వస్తువుల వాడకం వల్ల విద్యార్థుల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మంత్రి చెప్పారు. వీటిని పరిశీలించి, అన్ని గురుకులాలు, హాస్టళ్లకు సరఫరా చేసే విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవలసిందిగా అధికారులకు మంత్రి ఈశ్వర్ సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, అధికారులు హన్మంతు నాయక్, సర్వేశ్వర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY