కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికైన తెలంగాణ బిడ్డ వారాల ఆనంద్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ భావకవి గుల్జార్ కవితా సంకలనాన్ని వారాల ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’ పేరిట తెలుగులోకి అనువదించారు. తన అనువాదంతో గుల్జార్ లాంటి సుప్రసిద్ధ కవి సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు వారాల ఆనంద్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆనంద్ కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం స్థానిక ప్రజాప్రతినిధిగా తనకు మరింత సంతోషాన్ని ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ముందుగా అనువాదానికి సంబంధించి 2022 సంవత్సరానికి గానూ గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. డిసెంబర్ 22, గురువారం న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్లో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశమై సాహిత్య అకాడమీ అనువాద అవార్డు-2022 కోసం 17 పుస్తకాల ఎంపికను ఆమోదించింది. ఈ అవార్డుల కోసం నిర్దేశించిన నియమాలు మరియు విధానానికి అనుగుణంగా సంబంధిత భాషలలో ముగ్గురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీలు చేసిన సిఫార్సుల ఆధారంగా 17 పుస్తకాలు అవార్డుకు ఎంపిక చేయబడ్డాయని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన రచయిత, కవి వారాల ఆనంద్ అనువాదం ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకం అవార్డుకు ఎంపికయింది. ప్రముఖ కవి గుల్జార్ హిందీలో రచించిన ‘గ్రీన్ పోయెమ్స్’ పుస్తకాన్ని వారాల ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’గా తెలుగులో అనువాదం చేశారు. సాహిత్య అకాడమీ అనువాద అవార్డు కింద పతకంతో పాటు 50వేల నగదును బహుమతిగా అందిస్తారు.
మరోవైపు కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గానూ ముఖ్య అవార్డులను కూడా ప్రకటించింది. ఏడు కవితల పుస్తకాలు, 6 నవలలు, రెండు కథలు, మూడు ప్లే/డ్రామాలు, రెండు సాహిత్య విమర్శతో పాటుగా ఒక ఆత్మకథ వ్యాసం, ఒక వ్యాసాల సేకరణ మరియు ఇక సాహిత్య చరిత్ర 2022 సాహిత్య అకాడమీ అవార్డులను గెలుచుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన నవలా రచయిత మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’ నవలకు గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు కింద పతకం, శాలువాతో పాటు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE