ప్రజల సౌకర్యార్థం చేపట్టిన రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు సమన్వయంతో వ్యవహరిద్దామని దక్షిణ మధ్యరైల్వే అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు కోరారు. నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, లింక్ రోడ్లు, స్లిప్ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చెoదుకు రైల్వే పరిధిలో వున్నపనులలో వేగాన్ని పెంచడానికి రైల్వే శాఖతో సమన్వయం కోసం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనాన్ మాల్యా, ఇతర అధికారులతో మంత్రి కేటిఆర్ చర్చించారు. జిహెచ్ఎంసి ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎస్ఆర్డిపి, సిఆర్ఎంపి, స్లిప్, లింకురోడ్ల పనులను పూర్తి చేసేందుకు ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగంచేసుకుంటున్నట్లు తెలిపారు.
నగరంలో పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి లకు సంబంధించిన పనులు పెండింగులో ఉన్నాయి. ఆయా పనులను పూర్తి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకారాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతం నగరంలోజరుగుతున్న ఆర్వోబి, ఆర్యుబి ల ప్రగతిని దక్షిణ మధ్య రైల్వేఅధికారులతో చర్చిoచారు. జిహెచ్ఎంసి రోడ్డువర్కులతోపాటు హైదరాబాద్ జలమండలికి సంబంధించిన కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా దక్షిణ మధ్య రైల్వేతో జతకూడి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా సమావేశంలో చర్చించారు. రైల్వే శాఖ కూడా జిహెచ్ఎంసి మాదిరి వేగంగా పనులను పూర్తిచేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా చూడాలని కోరారు. వచ్చేవర్షాకాలం లోపల సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రైల్వేకు సంబంధించిన పనులను పూర్తిచేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని జిహెచ్ఎంసి అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్ఓబి / ఆర్యుబిల పూర్తికి చేపట్టేపనులకు అవసరమైన అన్ని రకాల అనుమతులను ప్రాధాన్యతగా గుర్తించి జారీ చేయనున్నట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. అలాగే తమవైపు పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ప్రతిపాదిస్తున్న స్లిప్, లింకు రోడ్ల విస్తరణ, రైల్వేఓవర్ బ్రిడ్జి లపై రైల్వే అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. దక్షిణ మధ్య రైల్వేతో సమన్వయంకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. రైల్వే క్రాసింగ్స్ వద్ద ప్రమాదాలనివారణకు ఆయా ప్రాంతాలలో చేపట్టాల్సిన పనులను సూచించుటకు నిపుణులు కమిటీ నియమించనున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ సమావేశoలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, మరియు రైల్వే ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డిఎస్ లొకేశ్ కుమార్, జలమండలి ఎండి దానకిషోర్, చీఫ్ఇంజనీర్లు వసంత, శ్రీధర్, జియాఉద్దీన్, సిసిపి దేవేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]