తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్లో జరిగే బయో ఆసియా సదస్సుకు పీయూష్ గోయల్ ను కేటీఆర్ ఆహ్వానించారు. అలాగే వరంగల్-హైదరాబాద్, హైదరాబాద్-నాగ్పూర్ రెండు కొత్త కారిడార్లు మంజూరు చేయాలని, హైదరాబాద్-బెంగళూర్-చెన్నైలను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ అంశంపై దక్షిణాది మంత్రులకు లేఖలు కూడా రాశామని పేర్కొన్నారు.
దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుతోపాటు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులకు మద్దతు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మా సిటీ, జహీరాబాద్ నిమ్స్ వివరాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన అంశాలపై వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని పీయూష్ గోయల్ తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది.
[subscribe]