ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆరోజు నుంచి విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో జేఎన్యూలో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జేఎన్యూ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో జరిగిన దాడిలో నిజానిజాలు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని జేఎన్యూ వైస్ ఛాన్సలర్ ఎం.జగదీశ్కుమార్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి జేఎన్యూ రిజిస్ట్రార్ డా.ప్రమోద్కుమార్ జనవరి 9, గురువారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలో ప్రొఫెసర్లు సుధీర్ప్రతాప్సింగ్, సుశాంత్మిశ్రా, సంతోశ్శుక్లా, మజహర్ ఆసిఫ్, భస్వతీదాస్ ఉన్నారు. దాడి ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు గురువారం నాడు, క్యాంపస్లో జరిగిన దాడిని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల నేతలపై జరిగిన దాడి ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. దాడి నేపథ్యంలో జేఎన్యూ వైస్ ఛాన్సలర్ ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. అనంతరం కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
[subscribe]