రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాజధాని గ్రామాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు రైతులు పాదయాత్ర తలపెట్టారు. పాదయాత్ర కోసం రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు భారీగా హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే రైతులు చేపట్టే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. అనుమతి లేనప్పటికీ పాదయాత్ర చేసి తీరుతామని రైతులు, మహిళలు ముందుకు సాగుతుండడంతో పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈక్రమంలో తుళ్లూరు గ్రామంలో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. తుళ్లూరు నుంచి కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, విరమించుకోవాలని పోలీసులు వారికీ వివరించారు. అయినప్పటికీ ముందుకు సాగుతున్న మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు స్పల్ప గాయాలయ్యాయి.
అలాగే మందడం గ్రామంలో కూడా రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ దేవత పోలేరమ్మకు మొక్కులు చెల్లించేందుకు ఆలయం వద్దకు చేరుకున్న గ్రామస్థులును పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ పోలీసులు మైక్లో ప్రకటిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, తుళ్లూరు, మందడం, నెక్కల్లు తదితర గ్రామాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మరోవైపు రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొనకుండా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
[subscribe]