తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన దీనిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో పాల్గొన్న అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు సహా సీఎస్ శాంతికుమారి తదితరులు హాజరైన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఇక ప్రతిపక్షాలు దీనిపై అనవసరంగా విమర్శలు చేస్తూ విద్యార్థులు, యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా టీఎస్పీఎస్సీకి గుర్తింపు ఉందని, ఒకేసారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత కూడా టీఎస్పీఎస్సీ సొంతమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 155 నోటిఫికేషన్లు విడుదలయ్యాయని, వీటి ద్వారా 37 వేల ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయటం జరిగిందని తెలిపారు. సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే లీకేజే వెనుక రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్నది తేల్చడానికి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ లీకేజీ వెనుక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని, కమిషన్ మొత్తానికి సంబంధం లేదని అన్నారు. ఇక గ్రూప్-1 సహా రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ఆ నాలుగు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతామని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE