తెలంగాణ రాష్ట్రంలో 2020-2030 సమయానికి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నూతన పాలసీని గురువారం నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030 ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చబోతున్నామని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు విజయవంతం కాబోతున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ద్వారా రాష్టంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పే అవకాశం ఉందని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. పరిశ్రమల కోసం భూములు ఉన్నాయని, ముఖ్యంగా మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు నూతన విధానంలో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి పలు రాయితీలను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెగా ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ, తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు సహా పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్ మినహాయింపు ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలకు తగినట్లుగా జాతీయ రహదారుల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనునట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu